8 పైన చెప్పినట్టుగా ఆయన, “నువ్వు బలులను గానీ, కానుకలను గానీ దహన బలులను గానీ పాప పరిహారం కోసం చేసే బలులను గానీ కోరుకోవు, వీటిలో నీకు సంతోషం ఉండదు. ఇవి ధర్మశాస్త్రం ప్రకారం అర్పించబడేవి” అన్నాడు. 9 ఆ తరువాత ఆయన, “చూడు, నీ ఇష్ట ప్రకారం చేయడానికి నేనున్నాను” అని చెప్పాడు. రెండవ ప్రక్రియను నెలకొల్పడానికి ఆయన మొదటి ప్రక్రియను పక్కన పెట్టేశాడు. 10 ఈ రెండవ ప్రక్రియలో యేసు క్రీస్తు దేహం ఒక్కసారే బలి కావడం చేత దేవుని ఇష్ట ప్రకారం మనకు శుద్ధి జరిగింది. 11 నిజంగా ప్రతి యాజకుడూ ప్రతి రోజూ నిలబడి ఒకే విధమైన బలులు అదేపనిగా అర్పిస్తూ సేవ చేస్తూ ఉంటాడు. అవి ఎప్పటికీ పాపాలను తీసివేయలేవు.
12 కానీ క్రీస్తు పాపాల కోసం శాశ్వతంగా నిలిచి ఉండే ఒకే బలి అర్పించి దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. 13 తన శత్రువులు అవమానం పొంది తన కాళ్ళ కింద పీటగా మారే సమయం కోసం వేచి చూస్తూ ఉన్నాడు. 14 శుద్ధి పొందిన వారిని ఆయన ఒక్క బలి ద్వారా శాశ్వతంగా పరిపూర్ణులుగా చేశాడు. 15 దీన్ని గురించి పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్షమిస్తున్నాడు. మొదట ఆయన ఇలా అన్నాడు,
19 కాబట్టి సోదరులారా, యేసు రక్తం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి మనకు ధైర్యం ఉంది. 20 తెర గుండా అంటే తన దేహం ద్వారా ప్రవేశించే కొత్తదీ, సజీవమూ అయిన మార్గాన్ని ఆయన మనకోసం తెరిచాడు. 21 దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుక, 22 విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత ఉన్న యథార్ధ హృదయంతో, కల్మషమైన మనస్సాక్షి నుండి శుద్ధి అయిన హృదయంతో, స్వచ్ఛమైన నీటితో కడిగిన శరీరంతో దేవుణ్ణి సమీపిద్దాం.
23 వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి చలించకుండా మనకు కలిగిన ఆశాభావం గూర్చిన మన ఒప్పుకోలుకు కట్టుబడి ఉందాం.
24 అధికంగా ప్రేమించడానికీ, మంచి పనులు చేయడానికీ ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ ఉండండి. 25 కొంత మంది సమాజంగా సమకూడడం మానేశారు. మీరు అలా చేయవద్దు. ఆ దినం దగ్గర పడడం చూసే కొద్దీ ఇంకా ఎక్కువగా అలా చేస్తూ ఉండండి.
26 సత్యాన్ని గూర్చిన జ్ఞానం స్వీకరించిన తరువాత కూడా మనం ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపాలకు ఇక బలులేమీ ఉండవు. 27 కానీ భయంతో తీర్పు కోసం ఎదురు చూడటమే మిగిలి ఉంటుంది. అలాగే దేవుని శత్రువులను దహించి వేసే ప్రచండమైన అగ్ని ఉంటుంది. 28 ఎవడైనా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తే ఇద్దరో ముగ్గురో చెప్పిన సాక్ష్యం మీద వాడిని ఎలాంటి దయాదాక్షిణ్యం లేకుండా చంపుతారు.
29 ఇలా ఉంటే మరి దేవుని కుమారుణ్ణి తమ కాళ్ళ కింద తొక్కివేసి, తనను శుద్ధి చేసిన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి, కృపాభరితమైన ఆత్మను అవమానించిన వాడికి మరి ఇంకెంత ఎక్కువ శిక్ష పడుతుందో ఆలోచించండి. 30 “ప్రతీకారం తీర్చడం నా పని. నేనే తిరిగి చెల్లిస్తాను” అనీ, అలాగే “ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు” అనీ చెప్పిన వాడు మనకు తెలుసు. 31 సజీవుడైన దేవుని చేతిలో పడడం భయానకమైన విషయం.
32 అయితే గతించిన రోజులను జ్ఞాపకం చేసుకోండి. మీరు వెలుగును అనుభవించిన తరువాత ఎంత గొప్ప హింసనూ వేదననూ భరించారో జ్ఞాపకం చేసుకోండి. 33 హింసల, అవమానాల వల్ల మీరు బహిరంగంగా అపహాస్యానికి గురయ్యారు. మరో వైపు అలాంటి వేదన అనుభవించిన వారితో మీరు భాగస్వాములయ్యారు. 34 ఇదెలాగంటే, మీరు ఖైదులో ఉన్నవారిని కనికరించారు. మీకు శ్రేష్ఠమైన, కలకాలం నిలిచి ఉండే సంపదలు ఉన్నాయని తెలుసుకుని మీకున్న ఆస్తిపాస్తులను ఇతరులు పట్టుకు పోతుంటే ఆనందంగా అంగీకరించారు. 35 కాబట్టి ధైర్యం కోల్పోవద్దు. ధైర్యంగా ఉంటే గొప్ప బహుమానం ఉంటుంది. 36 దేవుని ఇష్టాన్ని జరిగించిన తరువాత, ఆయన వాగ్దానం చేసిన వాటిని పొందడానికి మీకు సహనం కావాలి.